ఇస్మార్ట్‌ శంకర్‌ దాన్ని కూడా టచ్‌ చేశాడు

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనూహ్యంగా భారీ విజయాన్ని దక్కించుకుంది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం కనీసం పాతిక నుండి ముప్పై కోట్ల వరకు వసూళ్లు సాధిస్తే చాలని నిర్మాతలు కూడా అనుకుని ఉంటారు. బయ్యర్లు కూడా ఈ సినిమా అంతకు మించి వసూళ్లు చేయలేదని ముందు భావించారు. కాని మెల్ల మెల్లగా ఈ చిత్రం ఏకంగా 80 కోట్ల మార్క్‌ను టచ్‌ చేసింది. స్టార్‌ హీరోలకు మాత్రమే సాధ్యం అయ్యే ఈ మార్క్‌ ప్రస్తుతం రామ్‌కు దక్కింది. రామ్‌ కెరీర్‌లోనే ఇది ఒక దుమ్ము రేపిన చిత్రంగా నిలిచి పోయింది.

డబుల్‌ దిమాక్‌ అంటూ మాస్‌ ప్రేక్షకులను పూరి విపరీతంగా అలరించాడు. ఈ సినిమాకు పోటీ అన్నట్లుగా వచ్చిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం నీరసపడిపోవడంతో ఈ చిత్రంకు మరింత బూస్ట్‌ దక్కింది. ఏకంగా నాల్గవ వారంలో కూడా మంచి గ్రాస్‌ను ఈ చిత్రం రాబడుతోంది. రేపు విడుదల కాబోతున్న సినిమాల వల్ల ఈ సినిమా జోరు తగ్గే అవకాశం ఉంది. 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు 80.63 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు రాబట్టడంతో పూరితో సినిమాను చేసేందుకు విజయ్‌ దేవరకొండ ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.