మహానటి ఈ పేరు చిత్రసీమలోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా తెగ చక్కర్లు కొడుతుంది. నాగ అశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్ నటించిన ఈ మూవీకి జాతీయ అవార్డ్స్ రావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో మహానటి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ను ఆకాశానికి ఎత్తుతూ చిత్ర యూనిట్ కు అభినందనలు అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా వాళ్లంతా తమ స్పందనను తెలియజేయగా..
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా అవార్డు విన్నర్స్కి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ గుర్తిచింది. జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్తో పాటు మహానటి టీంకి అభినందనలు. అలానే రాహుల్ రవీంద్రన్, రంగస్థలం టీం తో పాటు నానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
2018 ఏడాదికిగాను 66వ జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు సత్తాచాటిన విషయం తెలిసిందే. సావిత్రి జీవిత కథతో రూపొందించిన మహానటి మూడు అవార్డులను గెలుచుకొని అగ్రభాగాన నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు..సినిమాలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా మహానటి పురస్కారాన్ని సాధించింది.