అఖిల్‌ ఇకపై ఆలస్యం చేయదల్చుకోవడం లేదట

అక్కినేని అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పటి వరకు ఈయన అఖిల్‌, హలో, మిస్టర్‌ మజ్ను చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలు ఫెయిల్‌ అవుతున్న నేపథ్యంలో సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకుంటున్నాడు. దాంతో ఇన్నాళ్లలో ఇంకా మూడే సినిమాలు అయ్యాయి. తాజాగా అఖిల్‌ తన నాల్గవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రూపొందుతోంది.

ఒక వైపు తన నాల్గవ సినిమాను చేస్తూనే అయిదవ సినిమాకు కూడా కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్‌ వర్మ తీసుకు వచ్చిన ఒక మంచి స్టోరీకి అఖిల్‌ ఓకే చెప్పాడు. చిన్న బడ్జెట్‌తో అఖిల్‌ మూవీ తెరకెక్కబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ సినిమా చేస్తూనే ప్రశాంత్‌ వర్మ సినిమాను కూడా చేయాలని అఖిల్‌ ఫిక్స్‌ అయ్యాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది రెండు లేదా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ఇప్పటి వరకు చేసిన ఆలస్యం చాలని, ఇకపై బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి వరుస సినిమాలు సరే కాని సక్సెస్‌ మాట ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తారేమో..?