మళ్లీ చిరు కోసం ప్రయత్నిస్తాడట

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంకు పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించబోతున్నాడని, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అంతలోనే సినిమా క్యాన్సిల్‌ అవ్వడం మరో సినిమాను చేయడం జరిగింది. సినిమా కథ మొదటి సగం స్క్రిప్ట్‌ పూర్తి చేసిన తర్వాత చిరంజీవి సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా కూడా చెప్పకుండానే మరో సినిమాను చేసేయడం జరిగింది. ఆ విషయంలో కాస్త ఫీల్‌ అయిన పూరి మళ్లీ చిరంజీవితో సినిమాకు ప్రయత్నాలు చేస్తానంటూ ప్రకటించాడు. వరుస ఫ్లాప్‌ల తర్వాత పూరికి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో సక్సెస్‌ దక్కింది. పూరి దర్శకత్వంలో మూవీకి పలువురు యంగ్‌ హీరోలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. కాని ఆయన దృష్టి మాత్రం మహేష్‌బాబు మరియు చిరంజీవిలతో సినిమా చేయాలని ఉంది.

మహేష్‌బాబుతో ఇప్పటికే ‘జనగణమన’ చిత్రం కాన్సెప్ట్‌ను అనుకున్నాడు. మహేష్‌ ఎప్పుడు ఓకే అంటే అప్పుడే వెంటనే సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇక చిరంజీవి గారితో సినిమాకు కూడా నేనెప్పుడు సిద్దమే అంటూ ప్రకటించాడు. చిరంజీవితో గతంలో చర్చించిన కథ కంటే ఇంకా తన వద్ద వేరే కథలు కూడా ఉన్నాయని, చిరంజీవి గారితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. అలాగే నేను కూడా ఆయన సినిమాను కోరుకుంటున్నాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిరంజీవి సినిమా అవకాశం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మొదట చిరు సైరాతో ప్రేక్షకుల ముందుకు రావాలి, ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏమైనా అవకాశం ఇస్తాడేమో చూడాలి.