జగపతి బాబు వ్యవహారంపై అనిల్ క్లారిటీ !


సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటుడు జగపతిబాబుని తీసుకొన్నారు. ఐతే, ఆయన సినిమా నుంచి సడెన్ గా తప్పుకోవడం చర్చనీయాంశం అయింది. జగపతికి కథ నచ్చలేదని, దర్శకుడు తీరు నచ్చక తప్పుకొన్నారని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. తాజాగా ఈ వ్యవహారంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ట్విట్టర్ వేదికగా చిన్నపాటి నోట్ ని పోస్ట్ చేశాడు.

“జగపతి బాబుగారు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించడానికి చాల ఆసక్తి చూపారు. ఈ సినిమాలో ఆయన తన పాత్రను ప్రేమించారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల.. ఆయన ఈ సినిమాలో నటించడం లేదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో జగపతి బాబుగారు మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చారు అనిల్.

ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతోంది. అక్కడ మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. వాటికి సంబంధించిన ఒకట్రెండు ఫోటోలు లీకయ్యాయి. అవి మహేష్ అభిమానులకి కిక్కునిచ్చాయ్. ఈ సినిమాలో మహేష్ జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిల్ సుంకర్-దిల్ రాజు-మహేష్ సంయుక్తం నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ విషయంపై జగపతిబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. ‘ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కోసం మరో రెండు సినిమాలని వదులుకోవడం కూడా నిజం. కానీ, కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కొన్ని జరుగుతుంటాయి. దాని వలన సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’ అన్నారు జగపతి.