టెక్కలి నుంచి టిడిపి అభ్యర్దిగా గెలిచిన కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదన్నారు ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెరాడ తిలక్ . ఎన్నికల అఫిడవిట్లో ఆయన పై ఉన్న అరెస్ట్ వారెంట్ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేసి ఓడిపోయిన పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. 2007లో మైనింగ్ కార్యాలయంపై దాడి ఘటనలో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ ఇంకా పెండింగ్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కాక ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని పేరాడ తిలక్ తెలిపారు. గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటన పై కూడా వైసీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని పై ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.