అభిమానుల్లో టెన్షన్ ..టెన్షన్

2019 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఉదయం నుంచి నాటింగ్‌హామ్‌లో వర్షం పడుతుండడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ వర్షం పడింది. తర్వాత ఆగిపోవడంతో మ్యాచ్ మొదలు పెట్టాలని భావించారు..కానీ వర్షం వల్ల గ్రౌండ్ తడిసిపోవడంతో.. గ్రౌండ్‌ను సిబ్బంది ఆరబెడుతున్నారు. దీంతో మ్యాచ్ ఆలస్యం కానుంది.

మరోపక్క ఇరు జట్ల క్రికెట్ అభిమానులు దేవుడా.. దేవుడా.. ఇవాళ ఒక్కరోజు వర్షం పడకుండా చూడు అంటూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం స్టేడియం ఆరబెట్టే పనిలో సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది సేపట్లో తనిఖీలు నిర్వహించి టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఫుల్ జోష్ మీద ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉంది. మరి వాన దేవుడు ఏం చేస్తాడో చూడాలి.