సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం..!

Shobaకర్ణాటక రాజకీయాలు మరోసారి సంక్షోభం దిశగా సాగుతున్నాయి. భాజపాపై తిరుగుబాటు ప్రకటించి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకున్న యడ్యూరప్ప మద్దతుదారులైన ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు ఈ ఉదయం మంత్రులు శోభా కరంద్లాజె, ఉదాసి కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు. ఇదేబాటలో మరో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.

కాగా యడ్యూరప్ప విధేయ మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం శాసన సభ్యత్వాలకు రాజీనామా చేస్తారని ప్రబలంగా వినిపిస్తుండడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజీనామా చేయడానికి సిద్ధపడిన ఎమ్మెల్యేలు సైతం లేఖలను స్పీకర్ కంటే గవర్నర్ కు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారని సమాచారం. మొత్తానికి జగదీశ్ సర్కారు మనుగడ డోలాయమానంలో పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.