శ్వేతపత్రం కావాలి… చంద్రబాబు

Chandrababu Naiduకాళ్ళ నెప్పులు, అనారోగ్య సమస్యలు ఎంతగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ, ప్రజలు పడుతున్న బాధలతో పోలిస్తే అవి పెద్దగా లెక్క చేయదగినవి కాదని తెలుగుదేశం పార్టి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ‘ వస్తున్నా… మీకోసం ‘ పేరుతో ఆయన చేస్తున్న పాదయాత్ర సోమవారం సాయంత్రానికి కృష్ణా జిల్లా లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పీర్ మహమ్మద్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కరెంటు కొరత లేని పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాము అధికారంలోవుండగా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని ఆయన గుర్తు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో కిరి కిరి ముఖ్యమంత్రి వున్నారని, విద్యుత్ శాఖకు మంత్రి కూడా లేరని, ముఖ్యమంత్రికి విద్యుత్ సమస్యల పట్ల సరైన అవగాహన కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పతనంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు. కష్టమైనా సరే తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆయన వాగ్దానం చేసారు.