”ట్విటర్..నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్గా అనిపిస్తోంది. నిన్ను వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆసక్తికరమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. థాంక్యూ’ అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ట్వీట్ తర్వాత ఆయన కొంతమందిని ఫాలో అవుతున్నట్లు నోటిఫికేషన్ లు వస్తున్నాయి. ఇందులో తెలుగు సెలబ్రిటీలు కూడా వున్నారు. అల్లు అర్జున్, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, నందమూరి కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, ఇలా చాలా మందిని అమితాబ్ ఫాలో అవుతున్నట్లు నోటిఫికేషన్ లు వచ్చాయి. అసలు ఈ విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కావటం లేదు జనాలకి.
చాలా మంది సెలబ్రిటీలు ట్విటర్లో బిగ్బి తమని ఫాలో అవుతున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రచారం కోసమే అమితాబ్ ఇలా చేస్తున్నారని, ఆయన ఖాతా హ్యాక్కు గురై ఉంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై తాజాగా అమితాబ్ ట్విటర్లోనే నెటిజన్లకు దీటుగా సమాధానమిచ్చారు.
‘అవును..నేను ట్విటర్లో చాలా మందిని ఫాలో అవుతున్నాను. నా ఇష్టానుసారంగానే ఇలా చేస్తున్నాను. చాలా మంది నా ఖాతా హ్యాకైందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఇతరులను అనుసరించడం తప్పా? అదే అయితే ఈ ట్విటర్లోనే లక్ష తప్పులు చేస్తా’ అంటూ మరో హాట్ కామెంట్ చేశారు బిగ్ బి.