సక్సెస్‌ వందే జగద్గురుం అంటోన్న క్రిష్ టీం

అందాల నయనతార రానా వంటి వ్యక్తిని ఇంతవరకు తాను చూడలేదని కితాబిచ్చింది. ” అందరికంటే ముందుగా సెట్స్ మీదకు వచ్చి, అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించే నటుడు రానా. ఈ సినిమా కోసం దెబ్బలు తగిలించుకున్నాడు, చాలా కష్టపడ్డాడు” అని చెప్పింది నయన. ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో నయనతార నాయికగా క్రిష్ దర్శకత్వంలో నటించిన సంగతి తెలిసిందే. జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 30న విడుదలై విజయాన్ని సాధించిన సందర్భంగా మంగళవారం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న నయనతార “కథలోని దేవిక పాత్రను నేను చేయగలనని నమ్మిన క్రిష్‌కు థాంక్స్. ఓ మంచి పాత్ర చేశాననే తృప్తి కలిగింది. డబ్బింగ్ సమయంలో రచయిత సాయిమాధవ్‌ను ఇబ్బందిపెట్టా” అని చెప్పింది.

క్రిష్ మాట్లాడుతూ “ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం నాకూ, రానాకూ ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఓవర్సీస్‌లోనూ పెద్ద విజయం సాధించింది. సమష్టి కృషి ఫలితం ఈ విజయం” అన్నారు. రానా మాట్లాడుతూ “ఏదో కొత్తగా చెయ్యాలనే తపన ఉండే నాకు బీటెక్ బాబు వంటి మంచి పాత్రనిచ్చాడు క్రిష్. నా సినిమాలు ఎప్పుడూ చెయ్యనంత రెవెన్యూని బడ్జెట్‌గా పెట్టి ఈ సినిమా తీశారు. క్రిష్ టేకింగ్, నయనతార నటన, విజయన్ ఫైట్స్, మణిశర్మ మ్యూజిక్, సాయిమాధవ్ డైలాగ్, కోట, పోసాని వంటివాళ్ల నటన ఈ సినిమాకి ప్లస్సయ్యాయి” అన్నారు. పెద్ద కమెడియన్లు చెయ్యాల్సిన టిప్పు సుల్తాన్ పాత్రను తను చేస్తేనే అందంగా ఉంటుందని నమ్మి క్రిష్ తనకు ఆ పాత్రనివ్వడం, దానికి మంచి పేరు రావడం ఆనందంగా ఉందని పోసాని అన్నారు.