కేసిఆర్ ను ఉరి తీయాలి – మోత్కుపల్లి

తెలంగాణా పేరుతో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, శాసన సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. అంతర్జాతీయ తీవ్రవాది కసాబ్ లానే కేసిఆర్ ను కూడా ఉరి తీయాలని ఆయన తీవ్రస్థాయిలో డిమాండ్ చేసారు. ఆదివారం నాడు ఇక్కడి గన్ పార్క్ వద్ద తాను చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ కేసిఆర్ పార్లమెంటు లో మాట్లాడితే తెలంగాణా వస్తుందేమో గానీ , సూర్యాపేట లో బహిరంగసభ లో మాట్లాడితే తెలంగాణా రాదనీ మోత్కుపల్లి అన్నారు. కేసిఆర్ కు నిజంగా తెలంగాణా పట్ల చిత్తశుద్ధి వుంటే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయమంటూ ఎందుకు డిమాండ్ చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. కేసిఆర్ పోరాటం కేవలం ఓట్లు, సీట్లు కోసం మాత్రమేనని, సభలు, సమావేశాల పేరుతో కాలం వెళ్ళబుచ్చుతున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. కాగా ధర్నా ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు మోత్కుపల్లిని అరెస్టు చేసారు.