పౌరాణిక చిత్రాలు అంటూనే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు… నందమూరి తారక రామారావుగారు. ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ తరువాతి తరంలో పౌరాణిక పాత్రలకు నేనే పర్ ఫెక్ట్ అంటూ నిరూపించుకున్నారు. అంతేకాదు బాలకృష్ణ “నర్తనశాల”ను తన దర్శకత్వంలో తెరకెక్కించడం తన చిరకాల కోరిక అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అన్నట్టుగానే కొద్ది సంవత్సరాల క్రితం ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు కూడా. అయితే అందులో ద్రౌపది పాత్రధారిణి అయిన సౌందర్య ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో బాలయ్య నర్తనశాలకు లాంగ్ కామా పెట్టేశారు. మళ్ళీ ఇంతకాలానికి నర్తనశాల వెలుగులోకి వచ్చింది. అయితే ద్రౌపదిగా ఎవరిని తీసుకోవాలా అనేది బాలయ్యకు ఓ పెద్ద పజిల్ లా మారిపోయింది. ఇటీవలే నారారోహిత్ నటించిన “ఒక్కడినే” ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఆ చిత్ర కథానాయిక నిత్యామీనన్ ను ఉద్దేశించి “ఇంకాస్త హైట్ ఉండుంటే నిన్నే నా చిత్రంలో ద్రౌపదిగా సెలెక్ట్ చేసేవాడిని” అని కామెంట్ చేయడం కూడా ఇందుకు బలాన్నిచ్చింది. తాజాగా బాలయ్య సరసన “సింహా”, “శ్రీరామరాజ్యం” చిత్రాల్లో నటించిన నయనతారను ద్రౌపది పాత్రకు ఫైనలైజ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సీత పాత్రలో నయన్ మెప్పించడమేనట. ఇదే నిజమైతే మరోసారి నయనతార పౌరాణిక పాత్రలో కనిపించబోతుందన్నమాటే!