వైకాపా అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గత కొన్ని రోజులుగా బ్రదర్ అనిల్ పై కొనసాగిస్తున్న దాడి స్థాయిని ఇంకాస్త పెంచింది. దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అక్రమంగా ఆస్తులను కూడబెట్టకుని కంపెనీలు స్థాపించి.. వాటిని బినామీ సంస్థలుగా కొనసాగిస్తున్నారంటూ… టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరోపక్క మతప్రచారం పేరుతో రాజకీయ సభలను నిర్వహిస్తూ.. అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారని దయ్యబట్టారు. బినామీ సంస్థలకు సంబంధించిన రుజువు పత్రాలు తమ దగ్గరున్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
తాము చేసిన ఆరోపణలపై సమాధానాలు చెప్పకుండా అక్రమాలు చేయలేదని.. తాను భార్యా బిడ్డలపై ప్రమాణం చేస్తానని, బైబిల్ పైన ప్రమాణం చేస్తానని బ్రదర్ అనిల్ చెప్పడం విడ్డూరంగా ఉందని రేవంత్ అన్నారు. భార్య, బిడ్డలపైన ప్రమాణం చేస్తానని చెప్పిన బ్రదర్ అనిల్ ఏ భార్య పైన ప్రమాణం చేస్తారని ప్రశ్నించారు. సొంత భార్యా బిడ్డలను మోసం చేసి, డబ్బులకు ఆశపడి మరో భార్యాబిడ్డలతో ఉంటున్న ఆయన ఏ భార్యాబిడ్డలపై ప్రమాణం చేస్తారని రేవంత్ ప్రశ్నించారు. పవిత్రమైన బైబిల్ ను పట్టుకొని బ్రదర్ అనిల్ అబద్దాలు చెప్పడం మానుకుంటే మంచిదని ఆయన సూచించారు.
మరోవైపు బ్రదర్ అనిల్ ని ఇప్పటికే బీజేపీ టార్గెట్ చేసింది. అనిల్ నెలకొల్పిన బినామీ సంస్థలపై సీరియల్ కథనాలను వీడియాకు విడుదల చేస్తుంది. అంతేకాకుండా అనిల్ బినామీ సంస్థ బెనెటా జీఎం వీరభద్రారెడ్డి ఆత్మహత్యపై కూడా చాలా అనుమానాలను వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.






